ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేశారు. ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీ సీట్లన్నీ అధికార కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేదు. మొత్తం ఐదు సీట్లు కూటమికే దక్కనున్నాయి.
ఇప్పటి వరకు ఎన్నికల్లో అధికార కూటమి ఒప్పందం ప్రకారమే ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలబెడుతూ వచ్చింది. 5 సీట్లలో బీజేపీ, జనసేనలు కూడా తమకు ఒకటో, రెండో సీట్లను కోరే అవకాశం ఉంది. గతంలో ఆయా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఆయా పార్టీలకున్న సంఖ్యాబలం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి విభేదాలు లేవు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చ మొదలైంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సమయంలో సభలో చంద్రబాబు సీటు వద్దకు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు అక్కడే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. తర్వాత ఇద్దరూ కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్కు వెళ్లారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన మాట మేరకు ఓ సీటును నాగబాబుకు కేటాయిస్తున్నట్లుగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్కు చెప్పారు. దీంతో పవన్.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత నాగబాబు సహా మిగిలిన అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది.