తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్సై సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ ముగ్గురు మృతి చెంది దాదాపు నెలన్నర అవుతున్నా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. వీరు ఎలా మృతి చెందారనే దానిపై జిల్లా పోలీసు శాఖ సైతం ఎటూ తేల్చలేకపోతుంది. అయినా ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు శాఖ నివేదించినట్లు తెలిసింది.
ఈ ముగ్గురి మరణాలకు ఎవరూ కారణం కాదని పోలీసు శాఖ ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేసు చిక్కుముడి వీడకపోవడంతో పోలీసు శాఖ ఏదో ఒకచోట క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ముగ్గురి మృతి కేసు కథ కంచికేనా అనే చర్చ సాగుతోంది. అలా అయితే ఎందుకు చనిపోయారు అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోనుంది.
కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గత ఏడాది డిసెంబర్ 25 అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలు, మరుసటి రోజు మరో మృతదేహం తేలింది. ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు కదలడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కేసును ఛేదించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ముగ్గురి మొబైల్ లను సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాదుకు పంపించింది. అయితే పోలీసుల క్షేత్రస్థాయి విచారణలో మాత్రం చెరువులో మునిగిపోవడంతోనే మృతి చెందారని.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మొదట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ వ్యక్తిని కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
కేసులో సమాధానం లేని ప్రశ్నలెన్నో..!
ఎస్సై సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్… ఈ ముగ్గురి మరణాలపై ఉన్న అనేక సందేహాలను పోలీసు శాఖ బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ముగ్గురు చెరువు వద్దకు ఎందుకు వచ్చారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. మాట్లాడుకునేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువునే ఎందుకు ఎంపిక చేసుకున్నారు..? ఆత్మహత్య చేసుకుందామని మొదట నిర్ణయించుకున్న తర్వాతే వారు చెరువు వద్దకు వచ్చారా..? ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మధ్య ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి?.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే విచారణలో పురోగతి లభించే అవకాశం ఉంది. వివాదాలు పరిష్కరించుకునేందుకు చెరువు వద్దకు ముగ్గురు వచ్చి ప్రమాదవశాత్తు ఒకరు చెరువులో పడిపోతే కాపాడే ప్రయత్నంలోనే మిగతా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు భావిస్తున్నా దానిపై ఎలాంటి స్పష్టత లేదు.
సెల్ఫోన్లలో ఏముంది?
ముగ్గురి మరణాల కేసులో సెల్ఫోన్లు కీలకంగా మారాయి. ఈ సెల్ ఫోన్లు ఓపెన్ చేసేందుకు పోలీసు శాఖ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం.. ముగ్గురి ఫోన్లలో జరిగిన చాటింగ్, కాల్ డేటా ప్రకారం కొంత సమాచారాన్ని సేకరించి నివేదికను జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికాలకు పంపించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రత్యేక సాక్షులు ఎవరూ లేకపోవడంతో సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల నివేదికతో కేసును ఓ కొలిక్కి తేచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్స్ రిపోర్టుల ఆధారంగా ముగ్గురు నీటిలో మునిగి చనిపోయినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు.