కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. రేషన్కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్కార్డు దారులకు రూ.500కే సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు.
సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది. మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్ల కేటాయింపులు చేస్తారు. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత.. వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయనున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రతి నెల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లకు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రభుత్వం. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 చెల్లించేలా ఏర్పాటు చేయనున్నారు. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.