తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల అభ్యున్నతికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చిందని, దళితులకు ఉన్నత పదవులు , అవకాశాలను కల్పించేందుకు ఎప్పటికీ పాటుపడిందని చెప్పారు.
మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్కు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లోని 15 ఉపకులాలను ఒకశాతం రిజర్వేషన్కు సిఫారసు చేసిందన్నారు. గ్రూప్-1లోని 15 ఉపకులాల జనాభా 3.288శాతంగా ఉండగా… గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం సిఫారసు చేశామన్నారు. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాల జనాభా 62.748 శాతంగా ఉన్నారని.. గ్రూప్-3లోని ఎస్సీ ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినట్లు చెప్పారు. గ్రూప్-3లోని 26 ఉప కులాల జనాభా 33.963శాతంగా ఉన్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు ఇక ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం పట్ల మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి అభినందనలు తెలిపారు. అక్కడి నుంచి అంతా కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సహా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.