స్వతంత్ర, వెబ్ డెస్క్: సచివాలయం మీడియా సెంటర్ నుండి ఎంపీ, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఅర్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. 9 ఏళ్ళ కాలంలో బీసీలకు ఒక్క లోన్ ఇవ్వలేదని అన్నారు. ప్రతి బీసీకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు.పెంచిన ఫీజుల జీవోను వెంటనే విడుదల చేయాలన్న కృష్ణయ్య.. ప్రొఫెషనల్ కోర్సులో బీసీలకు మొత్తం ఫీజు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాసంస్థల్లో ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు ఫీజు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని పట్టుబట్టారు.
ఈ క్రమంలో బీసీలంతా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీసీ కాలేజి, హాస్టళ్లు అన్నీ అద్దె బిల్డింగ్ లేనని మండిపడ్డ కృష్ణయ్య.. గురుకులాలు, హాస్టళ్లు వెంటనే నిర్మించాలని అన్నారు. లేదంటే ప్రభుత్వ బిల్డింగ్ లను కబ్జా చేస్తామని హెచ్చరించారు. ధరణి వచ్చాక భూములన్నీ కబ్జాకు గురైతున్నాయని.. 111 జోవో రద్దు పేరుతో గండిపేట్, హిమాయత్ సాగర్ లను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందన్నారు. కెసిఆర్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి.. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.