- రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే ఎందుకంటూ ప్రశ్నలు
- ఆర్ధిక వెనుకబాటుకు రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం
- కాపులకు 5శాతం రిజర్వేషన్ అమలుకు పట్టుపడుతున్న నేతలు
- కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి మద్ధతు ఇస్తున్న పవన్కళ్యాణ్
- కాపు ఓట్ల చీలికతో వైసీపీ నేతల్లో గుబులు

అణగారిన జాతులను ఆదుకునేదిశగా రాజ్యాంగంలో పొదుపరిచిన ఆర్టికల్ ఇపుడు పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. ఎస్సీ, ఎస్టీ ఇతర నిమ్న కులాలకోసం రాజ్యంగంలో డా. బీఆర్ అంబేధ్కర్ కొన్ని ప్రత్యేక వసతులు కల్పించారు. రిజర్వేషన్లపై మార్పులు చేర్పులు కోరుతూ ఇపుడు చర్చలు, రీసెర్చ్లు జరుగుతున్నాయి. తాజా పరీస్థితులను చూస్తే.. అటు ఓసీల దగ్గర నుంచి ఇటు బీసీల వరకూ రిజర్వేషన్ల పోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల కోసమే రిజర్వేషన్లా?, మిగతా కులాల్లో పేదలు, అణగారిన వాళ్లు లేరా అంటూ వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యాంగంలో పొందు పరిచిన కులాలకే తప్ప, మిగిలిన కులాల్లో ఆర్దికంగా అణగారిన వాళ్లు లేరా అనే వాదన రోజు రోజుకూ బలపడుతుంది. దానిలో ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ తాజాగా తెరపైకొచ్చిన ప్రధాన అంశం. కేంద్ర ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసిన నేపథ్యంలో.. అందులో 5 శాతం కోటా కాపులకు ఇవ్వాలని అప్పట్లో ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనూ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
సామాజిక వివక్ష, వెనుకబాటు ప్రాతిపదిక కాకుండా ఆర్థిక ప్రాతిపదికన కేంద్రం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ పెరిగింది. రిజర్వేషన్లను కుల ప్రాతిపదికన అమలు చేయడంపై చర్చించాల్సిన అవసరం ఉందంటున్న విశ్లేషకులకు కాపుల రిజర్వేషన్లపై అన్ని రకాల చర్చలు జరగాలనే వాదనలు ఊపందుకున్నాయి. మరోమాటగా చెప్పాలంటే కాపు రిజర్వేషన్ డిమాండ్ దశాబ్దాలుగా బలంగా వినిపిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాపులను వెనుకబడిన కులంగా 1915లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. తాజాగా ప్రముఖ రాజకీయనేతలు ముద్రగడ, హరరామజోగయ్యలు కూడా మళ్లా కాపుల రిజర్వేషన్లపై తమగళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన కులాలతోపాటు, తాము కూడా ఆర్దికంగా అణగారిన కులాలకు చెందిన వాళ్లమే అంటూ నిరసన బాట పట్టారు.

మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరరామజోగయ్య కాపు రిజర్వేషన్ పై ఆయన స్వరాన్ని పెంచారు. తాను చనిపోయి అయినా సరే కాపు రిజర్వేషన్లు సాధిస్తానని శపధం చేసారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో డిసెంబర్ 31వ తేదీ లోపు స్పష్టత ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వానికి హరరామజోగయ్య అల్టిమేటం జారీ చేశారు. ఆయన జారీ చేసిన అల్టీమేటంకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, కాపు రిజర్వేషన్ల సాధన కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిరాహార దీక్ష చేపడతున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, .. అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబునాయుడు హయాంలో ప్రయత్నించారని హరిరామజోగయ్య గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాపులపై వైసీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణి కనపరుస్తుందంటూ విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రకటన ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీలో తాజా పరిణామాల పై రాజకీయ విశ్లేషకుల్లో తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వెల్లువెత్తుతున్న కాపు రిజర్వేషన్ పోరుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు తెలపడంతో దీనికి రాజకీయ రంగు అద్దినట్లైంది. దీంతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో 15 శాతానికి పైగా ఉన్న కాపుల ఓటుబ్యాంకు.. గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టిందనేది నగ్నసత్యం. ప్రస్తుత ప్రతిపక్షం అధికారంలోకి వచ్చి ఉంటే కాపు రిజర్వేషన్ అమలులోకి వచ్చి ఉండేదనే అభిప్రాయం చాలమందిలో వ్యక్తమవుతుంది.
మరి జరిగిందేంటి? ఒక్క మాట, ఒక్క ఛాన్స్అంటూ స్లోగన్ ఎత్తుకున్న ప్రస్తుత సీఎం జగన్ అధికారంలోకి రావడానికి కాపుల ఓట్లే ప్రధానం కాదా అనే ప్రశ్నలు విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. మూడేళ్లు గడిచినా బీసీలకు, ముఖ్యంగా కాపులకు జగన్ ఒరగబెట్టిందేం లేదనే వాస్తవాన్ని మాజీమంత్రి హరరామ జోగయ్య కుండబద్దలు కొట్టారు.
ఓ వైపు కాపు కులానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ చేపట్టిన ఉద్యమం, ఉగ్రరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది. మరోవైపు ఎంత వర్షం కురిసినా స్పందించని తీరు జగన్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అనుసురిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు.. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందనేది విపక్షాల ఆరోపణలు.

మరి కొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్ పోరు ఎంతోకొంతే కాదు.. భారీగానే జగన్ ప్రభుత్వంపై కనపడుతుందనేది వాస్తవం. మరోవైపు పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్ పోరాటానికి మద్దతు పలకడంతో ఇపుడు కాపులంతా వైసీపీని వదిలి జనసేనకే జైకోట్టే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోమాటగా చెప్పాలంటే టీడీపీకి కరుడుకట్టిన కాపుల ఓట్లు చీలిపోయే అవకాశం చాలా తక్కువగా ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యతిరేక ఓటును చీలనీయమంటూ పవన్ చెబుతున్న సెంటెన్స్ ఇపుడు సీక్వేన్సీగా నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా కాపుల వ్యతిరేక ఓటుపై దృష్టిపెట్టిన జనసేన నూటికి 95 శాతం సక్సెస్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యంలో ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకున్న హరిరామజోగయ్య, పవన్ కళ్యాణ్ సారధ్యానికి జైకొడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మరోమాటగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల స్టంట్ లో కాపు రిజర్వేషన్ పోరుగా భావించాలంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు పొత్తులపై తెరవెనుక జరుగుతున్న చర్చలు ఫలిస్తే మాత్రం వైసీపీకి గడ్డుకాలం తప్పదనేది పరిశీలకుల అంచనా. వైసీపీ మేల్కొంటే మాత్రం ఎన్నికలకు ముందే కాపు రిజర్వేషన్లపై ఓ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశముంది. ఓవైపు ముద్రగడ, మరోవైపు హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ పోరుకు పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో వైపీసీకి గుబులు పుడుతుందనేది విశ్లేషకుల అంచనా? ఇది జరుగుతుందా లేదా అనేదానికంటే కాపుల ఓట్లు కేవలం 15 శాతమేకదా అనుకుంటే మాత్రం జగన్ పప్పులో కాలేసినట్టే..!