స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయం రోజుకు మలుపు తిరుగుతుంది. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో తమకే టికెట్ వస్తుందని ఎంతో ఆశలు పెట్టుకున్న నేతలు, తీరా లిస్టులో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఈసారి ఎలాగైనా బరిలో దిగాలని పట్టుదలతో వరుస రహస్య మీటింగులతో మరింత హీట్ పెంచుతున్నారు.
ఇందులో మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరపున మైనంపల్లి హనుమంతరావు టికెట్ దక్కించుకున్నారు. అయితే మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్కు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని కాదని మైనంపల్లి కుమారుడికి సీటు ఇచ్చే పరిస్థితి లేదు. తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన నేరుగా ప్రశ్నించారు. వాళ్లకొక న్యాయం, తనకో న్యాయమా? అని ఆయన నిలదీశారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరిలో రేపటి నుంచి తిరుగుతానని తెలిపారు. తొందరపడొద్దని, మీడియాతో మాట్లాడొద్దని శ్రేయోభిలాషులు తనతో ఒట్టు వేయించుకున్నారన్నారు. అందుకే వారం రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకుంటానని, ఆ తర్వాతే మీడియా ముందుకొస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకంటే తన కుమారుడే ఎక్కువ పని చేస్తున్నాడని ఆయన చెప్పారు.