తమ దళాల దాడిలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సిబ్బంది, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్ గాజాలో ప్రాణాలు కోల్పోవడంపై ఇజ్రాయెల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమవైపు నుంచి ఘోర తప్పిదం జరిగిందని చెప్పింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదంటూ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపింది. గాజాకు ఆహారం సరఫరా చేస్తున్న WCK బృందంపై ఇజ్రాయల్ దళాలు చేసిన దాడిలో ముగ్గురు బ్రిటన్ వాసులు, ఆస్ట్రేలియా, పోలండ్, అమెరికా, కెనడాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఓ పాలస్తీనా డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయిలో క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని గుర్తించడంలో పొరపడ్డామని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ తెలిపారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వారు యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు ఆహారం అందిస్తున్నారని, ధైర్యంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు. వారి మృతి తీరని లోటని చెప్పారు. సహాయక సిబ్బంది వాహనాలపై వైమానిక దాడి ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ తెలిపిందన్నారు. గాజాలో మానవతా సాయం క్లిష్టంగా మారిం దన్నారు బైడెన్. సామాన్యులకు సేవలందిస్తున్న వారి రక్షణకు ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోకపోవ డమే దీనికి కారణమని బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.
గాజాలో ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా పౌరులకు కావాల్సిన సాయం అందించేందుకు చేస్తున్న కృషిని అమెరికా కొనసాగిస్తుందని బైడెన్ తెలిపారు. అందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించు కుంటా మన్నారు. వారికి సాయం చేరేలా వెసులుబాటు కల్పించాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కైరోలో ఓ బృందం దీనిపైనే పనిచేస్తోందని చెప్పారు.మరోవైపు మృతుల్లో బ్రిటన్ పౌరులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించారు. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇజ్రాయెల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా దాడిపై వీలైనంత వేగంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నెతన్యాహుతో సునాక్ ఫోన్లో మాట్లాడారు


