ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈనెల 26న విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకు కవిత విచారణకు హాజరవుతారా..? హాజరు అయితే అరెస్ట్ తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలు సార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను.. నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసి.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు, సీబీఐ 41(A) నోటీసులు బీఆర్ఎస్ శ్రేణులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సీబీఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్కు కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది.
2021-22 మధ్య మొదలైన ఈ లిక్కర్ కేసు.. ఎక్సైజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై CBI విచారణకు సిఫారసు చేయగా.. వెంటనే ఆప్ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్కు కేంద్ర బిందువుగా సౌత్లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్ట్ చేసి విచారించింది. అందులో కవితకు సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్ట్ చేసింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్ట్స్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ, కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు.
ఆమెను పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్ట్ మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని.. సీబీఐ ఆరోపించింది. కానీ, కవిత తన పాత ఫోన్లను కూడా సీబీఐకు సమర్పించి.. తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ, మళ్లీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది.పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న గేమ్గా పలువురు ఆరోపిస్తుండగా…బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి. ఈ కేసు ఎటు దారి తీస్తుందో.


