తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండే నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లా దెందులూరు ఒకటి. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. ఇక్కడ్నుంచి పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన చింతమనేని మరోసారి గెలుస్తారని అంతా ఊహించినా.. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి రంగంలోకి దిగి.. చింతమనేనిని కోలుకోలేని దెబ్బతీశారు. అప్పటివరకు చింతమనేని కారణంగా దెందులూరు నియోజక వర్గం ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్గా ఉండేది. కానీ, అబ్బయ్య చౌదరి వచ్చాక పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అప్పటివరకు విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన అబ్బయ్యచౌదరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో నియోజకవర్గం రూపురేఖలు మార్చేపని మొదలు పెట్టారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో స్థానికంగా ఉన్న రాజకీయ వివాదలకు పుల్ స్టాప్ పెట్టారు. ప్రభుత్వం నుంచి 2 వేల 700 కోట్ల మేర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాలను తీర్చిదిద్దారు.
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓసారి గమనిస్తే..కొల్లేరు గ్రామాల్లో రహదారుల నిర్మా ణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు.. చెరువుల వివాదానికి చెక్ పెట్టి గత నాలుగున్నరేళ్లలో కొల్లేరు లంక గ్రామాల్లో ఒక్క పోలీస్ పికెటింగ్ లేకుండా పాలన చేసిన ప్రజాప్రతినిధిగా ఇక్కడి ప్రజలతో శభాష్ అన్పించుకున్నారు అబ్బయ్య చౌదరి. మాదేపల్లి-కైకలూరు రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ఎమ్మెల్యే. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్, రోడ్డు నిర్మాణం కోసం 270 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న సమస్యను తీర్చేశారు.శ్రీపర్రు కాజ్వే వద్ద వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగిం చారు. చింతమనేనిని ఢీ కొట్టడం.. గెలవటం ఓకే.. అభివృద్ధి పనుల విషయంలోనూ ఫర్వాలేదని చెప్పుకుందాం. మరి.. దెందులూరు నియోజకవర్గంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏమీ లేవా ? అంటే ఉన్నాయనే చెప్పాలి. మొదట్లో సాధారణమేనని చెప్పుకున్న ఆ సమస్య కాస్తా ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
అభివృద్ధి అనేది నాణేనికి ఒకవైపు మాత్రమేనన్న అభిప్రాయం ఇక్కడ విన్పిస్తోంది. అయితే.. ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేకపోయినా.. అతనికి షాడోగా ఆయన తండ్రి కొఠారు రామచంద్ర రావు వ్యవహార శైలి ఉందన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ఏ పనులు జరగాలన్నా కమీషన్లు ముట్టచె ప్పాల్సిం దేనన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు ఉదాహరణకు కైకలూరు-ఏలూరు రహదారి నిర్మాణం పనుల్లో భాగంగా.. దెందులూరు నియోజకవర్గం పరిధిలో జరగాల్సిన పనులు గత రెండు సంవత్సరా లుగా నత్తనడకన సాగుతున్నాయి. అదేమంటే ఎమ్మెల్యే తండ్రి రామచంద్రరావు వైపు వేలెత్తి చూపు తున్నారు ప్రైవేటు కాంట్రాక్టర్లు. ఇక, దెందులూరు నియోజకవర్గం పరిధిలో కోడిపందేలు, పేకాట జరగకుండా చూస్తానని ఎన్నికల్లో హామీనిచ్చారు ఎమ్మెల్యే. కానీ, ఇప్పటివరకు అలాంటిదేమీ లేదనే చెప్పాలి. యథేచ్చగా కోడిపందేలు, పేకాట నిర్వహణ సాగిపోతున్నాయని.. కోట్లలో డబ్బు చేతులు మారుతోందని ఆరోపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.
ఇక, ఏదైనా పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే నాన్నను కలవండి అంతా చూసుకుంటారు అని అబ్బయ్య చౌదరి చెబుతుంటారు. ఇక, ఎమ్మెల్యే చుట్టూ ఉండే కోటరి కూడా ఆయనకు మైనస్సేనని చెప్పాలి. ప్రత్యేకించి ముఖ్య అనుచరుడిగా చెప్పుకునే కామిరెడ్డి నాని వ్యవహార శైలి పార్టీలోనే కొందరికి ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్లు ఉన్నాయి. ఈయన సారథ్యంలోనూ కోడి పందేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తన తండ్రి షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నా ఎమ్మెల్యేకు మాత్రం ఆ మర కలు అంటుకోలేదు. దీంతో ఎన్నికలకు ముందుగా అభ్యర్థుల ఖరారు కోసం ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ అధినేత జగన్.. పలువురికి సీటు నిరాకరించారు. ఇంకొందరికి స్థాన చలనం కలగించారు. కానీ, అబ్బయ్య చౌదరికి మాత్రం ఆరు నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ప్రజల దృష్టిలో అబ్బయ్య చౌదరికి ఉన్న మంచిపేరే కారణమని చెప్పాలి. అందువల్లే నియోజకవర్గ ప్రజలు అబ్బయ్య చౌదరికి వందకు అరవై మార్కు లు ఇచ్చారు. మొత్తంగా…రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని అబ్బయ్య చౌదరి..ఈసారి అబ్బయ్య చౌదరిని ఓడించాలని చింతమనేని తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో దెందులూరు ఎన్నిక రసవత్త రంగా మారింది.