బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం – అక్షయ తృతీయ
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో బాసర క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లిం చుకున్నారు. త్రిశక్తి పీఠమైన వ్యాసపురిలో మహాకాళీ మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లను కొలిస్తే విద్యాబుద్ధులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
టీడీపీ అభ్యర్థి భారీ బైక్ ర్యాలీ
అనంత ప్రజలారా ఇంటి నుంచి బైటకు రండి. అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పండి అంటూ పిలుపు నిచ్చారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. ఓటు హక్కు వినియోగించు కోండి. ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయవద్దంటూ విజ్ఞప్తి చేసారు. నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. తాగునీటిని కూడా అందించలేని దుస్ధితి నగరంలో నెలకొందన్నారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
పోలవరం నియోజక వర్గంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్ధించారు. రోడ్ల సమస్యతోపాటు పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు సునీల్.
ఖమ్మం ఎపీ అభ్యర్థి రోడ్ షో
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్రావు రోడ్ షో ద్వారా ప్రచారాన్ని చేపట్టారు. టిడిపి, జనసేన పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రధాన రహదారిపై వున్న బజ్జి బండి వద్ద బజ్జీలు వేసి, టిఫిన్ సెంటర్లో చపాతీలు కాల్చారు. ప్రజల బాగోగులు పట్టించుకోని నేతల స్వలాభం వల్ల వెనుకబడిపోయిన ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం
మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో తనకందించిన అభిమానం ఎప్పటికీ మరువలేనన్న కృష్ణారావు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు మద్దతు పలకాలని కోరారు.
కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం
యూట్యూబ్ ద్వారా ప్రజాదరణ పొందిన హోటల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్లడానికి గుడివాడలో అభివృద్ధి, ఉపాధి లేకనే అన్నారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వెనిగండ్ల రాము, జనసేన ఎంపీ అభ్యర్ధి బాలశౌరిని గెలిపించాలని కోరారు. ఇప్పటికీ గుడివాడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్న ఆమె సరైన వైద్యం అందక తన తండ్రి చనిపోయాడని ఏ తండ్రికీ అలా జరగకూడదని అన్నారు.
హనుమాన్ స్వాముల అరెస్ట్ … తప్పుపట్టిన విశ్వహిందూ పరిషత్
నిర్మల్ జిల్లా భైంసాలో హనుమాన్ స్వాముల్ని అరెస్టు చేయడాన్ని తప్పుపట్టింది విశ్వహిందూ పరిషత్. అక్రమ అరెస్టులు సరికాదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కేటీఆర్ పై జరిగిన దాడిని ప్రస్తావించిన నేతలు స్వాముల అరెస్టును ఖండించింది. హనుమాన్ మాలధారులు శాంతియుతంగా నిరసన తెల్పుతున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలే రాళ్లురువ్వారన్నారు.
అత్యధికంగా పెరిగిన విమాన చార్జీలు
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ విమానయాన రంగంపై కూడా పడింది. హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు మోతమోగిస్తున్నాయి. 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉందని విమానాశ్రయ వర్గాలు చెప్పాయి. హైదరాబాద్ నుండి విశాఖ పట్నం, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కేరళ, గోవా, కొచ్చిలకు వెళ్లే విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం మేర పెరిగాయి.
లైన్ మేన్ మృతి
అన్నమయ్యజిల్లా రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న హరీష్ అనే లైన్మెన్ మృతి చెందాడు.రాజంపేట కోడూరు రోడ్డు ఎంజీఆర్ మాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సీఎం సభానంతరం విద్యుత్ పునరుద్దరణ పనిలో ఉన్న హరీష్ షాక్కు గురై కరెంట్ స్తంభం పై నుండి విద్యుత్ వైర్లపై పడ్డాడు. ఈ సంఘటన స్ధానికుల్ని తీవ్రంగా కలచివేసింది.