ఎన్డీయే కూటమి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు మొదలైందని మంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం- అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీలో కూటమి పాలన కొనసాగు తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్టు చేశారు.16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ మీద సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారన్నారు. సామాజిక పింఛన్లు 4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారని, అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం చేశారని ఎక్స్లో రాశారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి, వారి బంగారు భవిష్యత్తు కోసం నైపుణ్య గణన ఫైలుపై ఐదో సంతకం చేశారని ఎక్స్ వేదికగా పవన్ స్పష్టం చేశారు.


