ఇన్నాళ్లూ చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన హైడ్రా… తాజాగా చెట్ల పరిరక్షణపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే GHMC, అటవీ శాఖ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. వాల్టా చట్టం అమలుపై అధికారులతో చర్చించారు. రోడ్లు, కాలనీల్లో కూలే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. 100 శాతం చెట్లు బతికేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని సూచించారు.
వాల్టాచట్టం అమలవుతున్న విధానాన్ని ఆయన పరిశీలించిన ఆయన.. ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను ముందే గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్కు ఇబ్బందిగా మారుతున్న చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయడం, ఇంకా ఇబ్బందిగా ఉంటే వాటిని వేరే చోటికి తరలించి ట్రీ ప్లాంటేషన్ విధానంలో పెంచడం, చెట్లు తొలగించిన దగ్గర మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు రంగనాథ్. ఈ సమావేశంలో GHMC, హైడ్రా, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.