తెలంగాణలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పై చేయి సాధించడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. మార్చి 29వ తేదీ నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఆ లోగానే బీఆర్ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలను చేర్చుకొని.. ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీలను కూడా గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుందట.
ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ తమకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఎంఐఎం అడిగితే కాంగ్రెస్కు మూడు మాత్రమే దక్కుతాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే ఛాన్స్ ఉంది. తమ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ నేతలు తమ వర్గానికి రెండు సీట్లు ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు.
అయితే నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్ నుంచి ఏకంగా 40 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేరుగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సమావేశం కావాలని అనుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపిక కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న నేతల లిస్టు పెద్దగానే ఉంది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్రెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి, త్వరలో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్న జీవన్రెడ్డి, సామ రామ్మోహన్రెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, హరివర్ధన్రెడ్డి, జగదీశ్వర్రావు, అల్గుబెల్లి ప్రవీణ్రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. వీరందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. సీనియర్ నాయకుల నుంచి యువ నాయకుల వరకు ఎమ్మెల్సీ పదవుల కోసం తమదైన శైలిలో పైరవీలు చేస్తున్నారు.
ఇక ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, అద్దంకి దయాకర్, సింగాపురం ఇందిర, కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభరత్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో అద్దంకి దయాకర్ తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని బహిరంగంగానే చెప్పారు. ఇక గత ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన పిడమర్తి రవి కూడా ఎమ్మెల్సీని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తనకు తెలిసిన మార్గాల్లో అధిష్టానం వద్ద ఎమ్మెల్సీ పదవి కోసం గట్టిగానే పైరవీలు చేస్తున్నారట.
మైనార్టీల కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ అజారుద్దీన్, అజ్మతుల్లా హుస్సేనీ పేర్లు ఉన్నాయి. వీరిలో షబ్బీర్ అలీ కేవలం ఎమ్మెల్సీనే కాకుండా మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయలేదు. ఆ స్థానంలో మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేయడంతో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని చాన్నాళ్లుగా షబ్బీర్ అలీ డిమాండ్ చేస్తున్నారు.
ఇక బీసీ కోటాలో మధుయాష్కీగౌడ్, ఎగ్గె మల్లేశం, ఈరావత్రి అనిల్, చరణ్కౌశిక్ యాదవ్, సునీతా ముదిరాజ్, నీలం మధు, వజ్రేశ్యాదవ్, చెవిటి వెంకన్న, సంగిశెట్టి జగదీశ్వర్రావు, పున్నా కైలాశ్నేత, నవీన్ యాదవ్ పేర్లు ఉన్నాయి. మధు యాష్కి తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కికి ఆ పదవి తప్పిస్తారనే ప్రచారం ఉంది. దీంతో తనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని యాష్కి పట్టుబడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ పదవుల కోసం భారీగానే పోటీ ఉంది. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతందో కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.