స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అధిక ఉష్ణోగ్రతలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఆరు రోజులు ఆలస్యం అయింది. ఏటా రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి అడుగుపెట్టి.. అక్కడ నుంచి అన్ని జిల్లాలకు విస్తరిస్తాయి. ఈ ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అయినప్పటికీ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. విశాఖలో ఆదివారం 44.6 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 9.5 డిగ్రీలు అధికం. అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంది. ఆదివారం 86 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. ఇందులో 85 మండలాలు ఉత్తరాంధ్రలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని 110 మండలాల్లో వడగాలులు వీచాయి.
సోమవారం కూడా అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మొత్తం 134 మండలాల్లో తీవ్రంగా, 220 మండలాల్లో కొంతమేర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో కొన్నిచోట్ల రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.13, 14, 15 తేదీల్లోనూ వేడి గాలుల ప్రభావం కనిపించనుంది. ఉత్తరాది నుంచి వచ్చే గాలుల ప్రభావంతో సముద్ర గాలుల మీద ప్రభావం తగ్గిపోయింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల తేమ గాలులన్నీ అటువైపు మళ్లిపోతున్నాయి. దీనివల్ల రుతుపవనాలు నెమ్మదించడంతో ఉక్కపోత ఎక్కువ కావడంతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.