కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోరింగ పంచాయతీ పరిధిలోని సీతారామపురం, తాళ్లరేవు పంచాయతీల్లోని కేశవపురం రేవు వద్ద నుంచి ఏ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక మండల టీడీపీ నేతలతో పాటు , నియోజకవర్గ బడా టీడీపీ నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి పాయలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక తహశీల్ధార్ త్రినాధ్ ని వివరణ కోరితే, తనకు ఇందులో ఏ సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.