ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు (D. Suresh Babu) ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా థియేటర్లలో అమలవుతున్న రెంటల్ విధానం, పర్సెంటేజ్ విధానంపై తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది.
ఎగ్జిబిటర్లు , నిర్మాతలు తమకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు పర్సెంటేజ్ విధానం అమలుపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చ జరిగింది.
ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్( Suniel Narang) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ వ్యక్తిగత స్థాయిలో ఒకరినొకరు దూషించుకున్నట్లు సమాచారం. దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం అరుపులు, కేకలతో ఉద్రిక్తంగా మారింది.
పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు నిర్మాత దిల్ రాజు( Dil Raju)తో పాటు మరికొందరు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పినట్లు తెలిసింది.
సమావేశంలో పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ఎగ్జిబిటర్లు మాత్రం 2008 నుంచి పర్సెంటేజ్ విధానం కోసం పోరాడుతున్నామని, ఇప్పటికైనా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.


