పార్టీని చూసి ఓటు వేయాలా..? పార్టీకి మద్దతు ఇస్తున్న అధినేతను చూసి ఓటు వేయాలా..? లేదంటే మనోడే కదా అని సామాజిక వర్గాన్ని చూసి ఓటు వేయాలా..? ఖమ్మం లోక్సభ ఓటర్ మదిలో తలెత్తుతున్న ప్రశ్నిలివి. మరి ఖమ్మం గుమ్మంలో ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు..? ఓటర్లలో ఈ అయోమయానికి కారణాలేంటి..?
ఏ అభ్యర్థికి ఓటు వేయాలా అన్న సందిగ్ధంతో ఖమ్మం గుమ్మంలో ఓటర్లు డైలామాలో పడ్డారు. ఎంపీ ఎన్నికల వేళ తొలిసారి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవాతో అధికార పార్టీకి అనుకూల పవనాలు వీస్తుంటే, మరోపక్క హిందూ సెంటిమెంట్తో పలుచోట్ల బీజేపీ జోరు కొనసాగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా డీలా పడ్డ బీఆర్ఎస్కు అంతంతమాత్రంగానే సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య ఖమ్మం ఇలాఖాలో సుమారు 2 లక్షల 15 వేల మంది ఉన్న కమ్మలు ఎవరికి కాపు కాయలన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సీపీఎం, సీపీఐ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి బరిలో నిలువగా.. బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు పోటీకి సై అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఖమ్మం సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారని వేసిన అంచాలన్నీ తారుమార య్యాయి. ఖమ్మంలోనే కాదు.. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒక్క చోట కూడా తమ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశం లభించలేదు. అయితే,.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కమ్మ సామాజికవర్గం నాయకుడినే బరిలోకి దింపింది. మరోపక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏపీలో టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం ఎంపీ స్ధానంలో బీజేపీ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించేందుకు పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు లేకపోయినా కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ శ్రేణులు కృషి చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత జరిగిన నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో జగన్కు మద్దతుగా ఉంటున్న బీఆర్ఎస్ను గద్దె దించాలన్న కసితో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పొషించారు.
ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికలకు.. ప్రస్తుత పార్లమెంట్ ఎలక్షన్కు పరిస్థితి పూర్తిగా మారింది. కేంద్రంలో ఇండియా కూటమికి వ్యతిరేక కూటమి అయిన ఎన్డీయేలో జనసేనతోపాటు టీడీపీ కూడా చేరింది. ఈ పొత్తులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే తొలుత తెలంగాణలో బీజేపీ నాయకత్వం జనసేన, టీడీపీ శ్రేణులను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేయకపొవడంతో ఆ రెండు పార్టీల వారు అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. కానీ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ నేతలు అక్కడ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే చర్యలు చేపట్టడంతో తెలంగాణలోనూ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించని టీడీపీ ఏపీలో మాదిరిగానే ఇక్కడా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ఆలస్యమైదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. అప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురామరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు టీడీపీ కార్యాలయానికి వెళ్లి తెలుగు తమ్ముళ్ల మద్దతు కోరారు. అయితే మిత్ర ధర్మానికి కట్టుబడి ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ అభ్యర్ధి వినోద్రావుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఈ ప్రకటనతో పార్టీపరంగా ఉన్న డొలాయమానం తొలగి పోయినా, ఆ పార్టీ ఓటర్లు మాత్రం చాలా వరకు సందిగ్ధ పరిస్ధితుల్లోనే ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలా వరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే రెవంత్రెడ్డికి లోపాయికారి గా అండగా ఉంటారా అనే చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి ఒక్కసీటు కూడా ఇవ్వని కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలన్నవిమర్శ కూడా వినిపిస్తోంది. అదే జరిగితే టీడీపీ ఓటర్లలో చీలిక వచ్చే అవకాశముంది.
ఇక బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు కాపు నేత కావడంతో కొందరు ఆ సామాజిక వర్గం నుంచి సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారు. నెట్టింట పోస్టులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ కమ్మ సంఘం నాయకుడు తాము కాంగ్రెస్కు మద్దతు తెలుపు తున్నట్లు ప్రకటించడంతో అతడిపై పలువురు కాపులు ఫైర్ అయ్యారు. తన ప్రకటనను ఖండించారు. అయితే, ఇదే సమయంలో ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటనతో నామాకు సానుకూలంగా ఉన్న టీడీపీలోని కొందరు ఓటర్లు మళ్లీ వ్యతిరేకులుగా మారారనే ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ నుంచి తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధి లేనందున ప్రతిపక్షంలో ఉన్న నామాకు మద్దతు ఇవ్వాలని కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటే, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో కమ్మ సామజికవర్గ ఓటర్లలో కొంత గందర గోళం నెలకొంది. అయితే కాంగ్రెస్ తమ వర్గానికి చెందిన వారికి రాజ్యసభ సీటుతో పాటు మంత్రి పదవి, మూడు కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినందున కాంగ్రెస్కు ఓటేసే అవకాశముందం టున్నాయి రాజకీయ వర్గాలు.ఇలా మొత్తానికి ఖమ్మం గుమ్మంలో కాపులు ఎవరికి కాపు కాయాలా అన్న అమోయంలో ఉన్నారు. మరి ఎన్డీఏతో పొత్తుతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా..? నామా తమ సామాజిక నేత కావడంతో ఆయనకు మద్దతిస్తూ గెలుపు అవకాశాలకు తోడ్పాటు అవుతారా..? లేదంటే,.. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి హస్తంకే జై కొడతారా అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.