పొద్దు తిరుగుడు పంటకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 వేల 829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించారని.. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తాను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి 6 వేల 760 మద్దతు ధర చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయలేదని వెల్లడించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారన్నారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో లక్షా 65 వేల 800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37 వేల 300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందన్నారు. మొత్తం పంటలో కేవలం 25 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర 6,760 చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


