Telangana | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హరీశ్ రావుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ రావు ఓక పుస్తకమని.. ఆయనో పోరాట నాయకుడని అన్నారు. సిద్దిపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోమటి చెరువు సమీపంలో రూ.25 కోట్లతో నిర్మించే శిల్పారామంకు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు నుంచి మేం ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటామని అన్నారు. సిద్దిపేటను తెలంగాణకు ఒక మోడల్ గా చేసిన ఘనత హరీష్ దని కొనియాడారు. త్వరలోనే కోమటి చెరువు మంచి టూరిజం స్పాట్ గా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట సిగలో మరో మణిహారం శిల్పారామం అని అన్నారు. ఆలయాల ఖిల్లా, రిజర్వాయర్ ల జిల్లా సిద్దిపేట జిల్లా అని వ్యాఖ్యానించారు. సిద్ధిపేటకు విమానం, సముద్రం రెండే లేవు కానీ.. అన్ని వచ్చాయని అన్నారు. త్వరలో కోమటి చెరువు దగ్గర ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో డైనాసార్ పార్క్ రాబోతుందని అన్నారు.సిద్ధిపేట ఖ్యాతిని తలియజేసేలా కోమటి చెరువు చుట్టూ ఓ ప్రపంచాన్ని నిర్మిస్తామని అన్నారు.