“లక్షలు తీసుకున్నావ్.. కేసు ఎందుకు పెట్టావ్..? బాత్రూమ్లో డబ్బులు పెట్టేటప్పుడు వీడియో రికార్డు చేశాను.. ఆ వీడియోను మీ ఉన్నతాధికారులు, మీడియాకు చూపిస్తా”.. అంటూ ఓ వ్యక్తి చెప్పిన ఆడియో సంభాషణ ఇప్పుడు వైరల్ అయింది. ఇది సీఐ, బాధితుడి మధ్య జరిగిన సంభాషణ. ప్రస్తుతం ఈ ఆడియో సంచలనం రేపుతోంది. తాను డబ్బులు ఇచ్చినా ఎందుకు కేసు పెట్టావో చెప్పాలని నిలదీయడమే కాకుండా.. ఉన్నతాధికారులకు చెబితే నీ పని గోవిందా అంటూ బెదిరించాడు కూడా.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వైరల్ అయింది. ఫోన్ కాల్ని బట్టి చూస్తే కేసు పెట్టకుండా ఉండేందుకు సీఐకి ఓ వ్యక్తి లంచం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయినా కేసు పెట్టడంతో బాధితుడు సీఐకి ఫోన్ చేసి నిలదీశాడు. అంతేకాదు డబ్బులు తీసుకుని కూడా కేసు ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించాడు. నువ్వు కేసు పెడితే నేను ఊరుకుంటానా.. నువ్వు డబ్బులు తీసుకుంటుండగా తీసిన వీడియోని నీ పై ఉన్నతాధికారులకు పంపిస్తా.. అంటూ బెదిరించాడు కూడా.
సీఐ, మరో వ్యక్తికి సంబంధించి దాదాపు 10 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో రూ. 3 లక్షలు తీసుకుని కూడా కేసు నమోదు ఎందుకు నమోదు చేశావంటూ సదరు వ్యక్తి సీఐని బెదరించడం చర్చనీయాంశమైంది.
“కేసులో నన్ను రక్షించాలని మీ వద్దకు వచ్చి.. మీరు అడినట్టుగా రూ.3 లక్షలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బాత్రూమ్లో బకెట్లో పెట్టాను. అయినా నన్ను రక్షించకుండా ఎందుకు కేసు నమోదు చేశావు”.. అంటూ సదరు వ్యక్తి దబాయించాడు.
“బాత్రూమ్లో డబ్బులు పెట్టేటప్పుడు నేను వీడియో రికార్డు చేశా.. దాన్ని మీ ఉన్నతాధికారులు, మీడియాకు పంపిస్తా” అంటూ సీఐని హెచ్చరించాడు. కాపాడాలంటూ లక్షలు ఇచ్చినా కేసు పెట్టావంటూ సీఐతో వాగ్వాదానికి దిగాడు. సదరు వ్యక్తి బెదిరించిన అనంతరం.. సీఐ మాత్రం స్టేషన్కు రా.. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మదిగా సమాధానం చెప్పినట్టు ఆడియోలో తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది,.