రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని అన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై సచివాలయంలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారాయన. రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారాయన. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యయసాయ అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల.
అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు తుమ్మల. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుండి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సాహం ఇవ్వాలన్నరు. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వర్సిటీలలో ప్రస్తుతమున్న మౌళిక సదుపాయాల వృద్దికి , కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. రైతువేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరములో ఇంకో 1000 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని తుమ్మల ఆదేశించారు. రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలని.. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను , కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.