స్వతంత్ర, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఓవైపు మేనిఫెస్టోపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మినీ మేనిఫెస్టోకే ఇంతగా భయపడుతుంటే.. పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. పేదరికం చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో చదివే బిడ్డలందరికీ రూ.15వేలు ఇస్తామని ప్రకటించారన్నారు.
మహిళల కంట కన్నీరు రాకూడదనే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారని కొనియాడారు. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ.20వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ చేయలేని పనులు టీడీపీ అధికారంలోకి రాగానే చేయబోతున్నామని స్పష్టంచేశారు. మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని జవహర్ వెల్లడించారు.