స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై మరో అప్డేట్ వచ్చింది. అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కవిత పేరును ఈడి ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ ద్వారా స్కాం జరిగిందని వెల్లడించిన ఈడీ.. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తి అని రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టుకు తెలిపింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించినట్లు తెలిపింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ప్రాపర్టీలు కొన్నారని.. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో సమావేశాలు జరిగాయని పేర్కొంది.
ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు హైదరాబాద్ లో ప్రాపార్టీ లు కొన్నారని తెలిపింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపామని వివరించింది. ఈ క్రమంలో తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని కోరారు పిళ్లై తరపు న్యాయవాది. దీంతో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్.. రొటీన్ ఆర్గ్యూ మెంట్ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 2 కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.