స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అల్లారు ముద్దుగా కనిపెంచిన కొడుకులు పున్నామ నరకం నుండి రక్షిస్తాడనుకుంటే.. బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. వృద్ధాప్య వయస్సులో తన కుటుంబంలోని కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, వారి పిల్లలను చూస్తూ మురిసిపోయే వయసులో కూడా కన్నీటి చుక్కలు రాలుస్తున్నారు. చిన్నప్పుడు గుండెల మీద పెట్టుకొని పెంచిన కొడుకులే.. వృద్దాప్యంలో గుండెలు ఆగిపోయేటువంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తన పిల్లలను పెంచి, పెద్ద చేసి, పెళ్లిళ్లు, డబ్బులు, ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. వృద్ధాప్యంలో వారు కోరుకునేది ఒక్క ముద్ద అన్నం. అది కూడా కన్న కొడుకులు పెట్టలేక అనేక అవమానాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి కొడుకుల్ని చూడడానికేనా వీళ్ళని కన్నది అని కుమిలి పోయేలా పుత్రులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా, జరిగిన ఓ ఘటన తలుచుకున్నంత మాత్రాన హృదయం బరువెక్కిపోతుంది.
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరి మనసుల్ని కలిసివేస్తుంది. వృద్ధుడైన కారణం చేత వంతుల వారీగా కుమారులు తన తండ్రిని చూసుకుంటున్నారు. ఏ గొడవలు అయ్యాయో.. మనసు ఎంత గాయపడిందో.. వంతుల వారీగా కుమారుల వద్దకు వెళ్లడం ఇష్టం లేక వృద్ధుడు వెంకటయ్య (90) ఆత్మాహుతి చేసుకున్నారు. గ్రామశివారులో ఒంటికి నిప్పంటించుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వయసులో ఇలా చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.