తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ముగియగానే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై.. కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టేందుకు .. బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జూలై 25న కాళేశ్వరం చేరుకుని మొదటగా LMD రిజర్వాయర్ ను పరిశీలించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని.. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో చూపించి.. తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే.. యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం నిర్మించామని.. కాంగ్రెస్ అది విఫలయత్నం అని చూపించి బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని లక్షలాది మంది రైతుల జీవితాలతో .. కాంగ్రెస్ చెలగాటమాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
జూలై 26న రెండో రోజు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనను కొనసాగించారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మొదటగా మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న కేటీఆర్కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కన్నెపల్లి లక్ష్మీ పంపు హౌస్కు చేరుకొని పరిశీలించారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందితే .. ఇంకా ఎందుకు పంపింగ్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నీటితో నింపవచ్చని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ కొట్టుకు పోతుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం వట్టిదేనని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువని.. కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని కేటీఆర్ సూచించారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని చెప్పారు. శ్రీరాంసాగర్ సామర్థం 90 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎల్ఎండీలో 5 టీఎంసీలు, మిడ్ మానేరులోనూ 5 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అనేక జిల్లాల్లో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఆగస్టు 2 లోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్న జలాశయాల్లో నీటిని నింపాలని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే.. 50 వేల మంది రైతులతో తామే ప్రాజెక్టులను ముట్టడించి పంప్హౌస్లు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.