కర్ణాటకలో ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్స్టే యజమానితో సహా ఇద్దరు మహిళలపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. టెక్ హబ్ బెంగళూరు నుండి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్లోని కాలువ ఒడ్డున మరో ముగ్గురు పర్యాటకులతో కలిసి నక్షత్రాలను వీక్షిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
నిందితులు ముగ్గురు పర్యాటకులను కాలువలోకి తోసి, మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాకు చెందిన డేనియల్ , మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే పర్యాటకుడు కాలువ నుంచి బయటపడగా, ఒడిశాకు చెందిన బిబాష్ నీటిలో మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని శనివారం ఉదయం పోలీసులు గుర్తించారు.
నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, బాధిత మహిళలు ప్రభుత్వ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
“సనపూర్ సమీపంలో మొత్తం ఐదుగురు వ్యక్తులపై దుండగులు దాడి చేశారు.. వారిలో ఇద్దరు మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు – ఒక అమెరికన్, మరొకరు ఇజ్రాయెల్కు చెందిన మహిళ ఉన్నారు. నిందితులు తమపై దాడి చేయడమే కాకుండా, ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది” అని కొప్పల్ పోలీసు సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్ది తెలిపారు.
29 ఏళ్ల హోమ్స్టే యజమాని తన ఫిర్యాదులో.. తాను, నలుగురు అతిథులు రాత్రి భోజనం తర్వాత తుంగభద్ర ఎడమ కాలువ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి వెళ్ళినప్పుడు నిందితులు బైక్పై వచ్చారని చెప్పారు.
మొదట పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగి, పర్యాటకుల నుండి రూ.100 డిమాండ్ చేయడం ప్రారంభించారు. నిరాకరించడంతో, వారు పర్యాటకులపై దాడి చేసి, పురుషులను కాలువలోకి తోసి, మహిళలపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి తమ మోటార్ సైకిల్పై పారిపోయారని తెలిపారు.
నదిలో గల్లంతైన పర్యాటకుడి కోసం అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్ సాయంతో వెతకగా.. అతని మృతదేహం లభించింది.
నిన్న బిబాష్ కోసం అగ్నిమాపక అధికారులు, పోలీసు డాగ్ స్క్వాడ్ను మోహరించారు. ఈ ఉదయం కాలువ ఒడ్డున అతని మృతదేహం గుర్తించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు కోలుకుంటున్నారని.. కానీ వారు కోరుకుంటే వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించవచ్చని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ ఆరోపణల కింద పోలీసు కేసు నమోదు చేశారు.
మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకున్నామని కొప్పల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరసిద్ది తెలిపారు. నిందితులను గుర్తించామని.. రెండు ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయని ఆయన అన్నారు. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు.