స్వతంత్ర వెబ్ డెస్క్: రాబోయే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే పాలేరు నియోజకవర్గం మొత్తానికి దళిత బంధు ఇప్పించే బాధ్యత నాది అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హుజూరాబాద్లో ఎలాగైతే దళిత బంధు అమలు చేశామో.. పాలేరు నియోజకవర్గంలో కూడా అలాగే అమలు చేస్తామన్నారు. కోట్లు, నోట్లు పట్టుకుని వచ్చే వాళ్లు ఏమి చేయరని, ఉపేందర్ను అసెంబ్లీ వాకిలి దాటిస్తే దళితబంధు తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. శుక్రవారం పాలేరులో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్.. పూటకో పార్టీ మారే వాళ్లను నమ్మి ఓటు వేయొద్దన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిల్లు తొక్కనివ్వమని డబ్బు, అహంకారంతో కొందరు ఇక్కడ మాట్లాడుతున్నారని పొంగులేటి, తుమ్మలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మిత్రుడు తుమ్మలకు నేను అన్యాయం చేశానని ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోతే మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేశాను. ఇంట్లో కూర్చున్న తుమ్మలకు పదవులిస్తే ఇవాళ అన్యాయం చేశామని మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన నిన్ను మంత్రిని చేస్తే తుమ్మల చేసింది గుండు సున్న. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకుండా చేశాడు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేశారా? తుమ్మలే బీఆర్ఎస్కు అన్యాయం చేశారా ప్రజలే న్యాయం చెప్పాలన్నారు.