ప్రజలే ఫస్ట్ అనే విధానంలో అధికారులు పనిచేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. IVRSతో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామస్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్ పైనా అధికారుల నివేదిక తీసుకున్నారు. 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు.