రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర బాబు రంగం సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 నుంచి ప్రజాగళం పేరుతో ప్రచారం చేయనున్నారు చంద్ర బాబు. 20 రోజుల పాటు 20 పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ పరిధిలో సభ, రెండు అసెంబ్లీ పరిధిలో రోడ్ షో చేయాలని యోచిస్తున్నారు. చంద్ర బాబు ప్రచారంలో జనసేన, బిజెపి నేతలు పాల్గొనేలా అయా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
టీడీపీ ఇంకా లోక్సభ అభ్యర్థులతో పాటు, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాల్ని ఇవాళ లేదా రేపు ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. 26 నుంచి ప్రజాగళం పేరుతో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది. ఉదయం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల మందితో ప్రజాగళం సభ జరుగుతుంది. మధ్యాహ్నం ఒక నియోజకవర్గంలో, రాత్రి మరో నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు. 26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారు.