స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు వైసీపీ ప్రభుత్వం వేధింపులు పెరిగిపోతున్నాయని.. టీడీపీ నేతలను లొంగదీసుకోవడానికి అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఫోన్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు.
వైసీపీలో చేరలేదనే అక్కసుతోనే ఆదిరెడ్డి కుటుంబంపై సీఎం జగన్ కక్ష సాధింపులకి పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే వేళ.. ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని ఎద్దేవా చేశారు. ఫిర్యాదులే లేని కేసుల్లో టీడీపీ బీసీ నేతలైన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న జగత్జనని చిట్స్ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వారిద్దరినీ సీఐడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.