రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పునరుజ్జీవనం ఆరంభమైంది. కర్ణాటక, తెలంగాణలో తిరిగి అధికారం కైవసం చేసుకున్న ఆలిండియా కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. యువ నాయకురాలు వైఎస్ షర్మిలకు ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ద్వారా పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో స్తబ్దత నెలకొంది. 2014, 2019 లలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఆ పార్టీని పెద్ద దెబ్బే తీసింది. అటు హిమాచల్ ప్రదేశ్ , ఇటు కర్ణాటక, తెలంగాణ లో కాంగ్రెస్ విజయం, అధికారం చేపట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే.. అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించారు. పదేళ్లుగా అధికారం కోల్పోయి, చెల్లా చెదరై పోయిన కార్యకర్తలను ఒక్కతాటిపై తెచ్చి, ప్రజాసమస్యలపై పోరాడేందుకు పార్టీ సిద్ధమైంది. ప్రజాసమస్యలపై గళం ఎత్తడం ప్రతిపక్షాల బాధ్యత. పార్టీకి కొత్త జీవం పోయాలంటే.. ప్రజా సమస్యలపై ఎప్పటి కప్పుడు స్పందిస్తూ.. ఆందోళన చేస్తూ, సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయడమే ఏకైక మార్గం. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహం రగిల్చిన షర్మిల ఈ పంథానే ఎన్నుకున్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెడుతున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పేరుతో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారంలోకి వస్తే.. మెగా డిఎస్సీ ప్రకటిస్తానని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారు. ఎన్నికలు కేవలం రెండు నెలలు ఉందనగా, కేవలం 6,100 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు రగిలిపోయారు. ఈ నోటిఫికేషన్ ను ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్రధానాస్త్రం అయింది. నేతలైతే మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ మంత్రులు అధికార పార్టీ నేతల ఇళ్ళ ముందు ధర్నాలు ఆందోళనకు సిద్ధమైంది.
ఏపీసిసి అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఛలో సెక్రటేరియట్ కు పిలుపు నిచ్చారు. కుమారుడి వివాహం కోసం కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల నిన్ననే గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వెంటనే గన్నవరం నుంచి షర్మిల మాజీ ఎంపీ కెవిపి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిలను పోలీసులు వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో షర్మిల బుధవారం సాయంత్రం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ కు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేసిన షర్మిల ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి సెక్రటేరియట్ కు బయలుదేరారు.
షర్మిల ఛలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్ర రత్న భవన్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల నిర్బం ధాన్ని దాటుకొని షర్మిల సెక్రటేరియట్ వైపు దూసుకెళ్లారు. అయితే షర్మిలను సెక్రటేరియట్ వెళ్లకుండా ఉండ వల్లి వద్ద పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తనను సెక్రటేరి యట్ కి వెళ్ళకుండా మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేయడంపై షర్మిల మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే అన్నారు షర్మిల. ఉపాధి అవకాశాలు కరవై బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాలేదనీ విమర్శించారు షర్మిల.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అన్న పాలనలో చెల్లెలు అరెస్ట్ … ఇదే ప్రథమం. జగన్ పాలనలో ఆయన సోదరి షర్మిల అరెస్టయ్యారు. ఏపీలో నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ ను 2024 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాదరణ పొంది.. అసెంబ్లీ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించవచ్చు. .


