అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న పలు ఆన్ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఓటీటీల్లో అశ్లీలత శృతిమించడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్య కంటెంట్ ఉన్న 18 ఓటీటీలపై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి చెందిన 19 వెబ్సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేసింది. అశ్లీల కంటెంట్ని తొలగించాలని, చాలా రోజుల నుంచి ఈ ఫ్లాట్ ఫామ్స్ను కేంద్రం హెచ్చరిస్తోంది. అయినా, స్పందించకపోవడం వల్ల ఇప్పుడు వేటు వేసింది.
అభ్యంతరకర కంటెంట్ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అశ్లీల కంటెంట్ పై సంబంధిత ఆన్ లైన్ వేదికలకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ… వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 OTT ప్లాట్ఫామ్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. వీటిపై నిషేధం విధించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 12న ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 10 యాప్స్ని వెంటనే బ్లాక్ చేయాలని స్పష్టం చేశాయి. వీటిలో గూగుల్ ప్లే స్టోర్లోని 7 యాప్స్, యాప్స్టోర్లో మూడు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకుంది.
యువతరం మినహా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడంతా ఓటీటీల్లోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా వచ్చినా.. ‘రేపు ఎలాగూ ఓటిటిలో వస్తుంది కదా’ అని ఓ నెల రోజులు ఆగి, ఓటిటిలోనే చూస్తున్నారు. వీటికి ఉన్న క్రేజ్ ను గమనించిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీల్లో వచ్చే మూవీలు, వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో అసభ్యత, అశ్లీలత ఎక్కువ ఉంటోంది. దాంతో ఇంటిల్లిపాదీ టీవీ ముందు కూర్చుని చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం 18 ఓటీటీలపై కొరడా ఝళిపించింది. ఓటీటీకి చెందిన 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు, 57 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను కేంద్రం బ్లాక్ చేసింది.


