ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత KCR నిర్ణయించారు. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
19న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరుకానున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించేందుకు.. తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటీఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు ప్రత్యేక సమావేశంలో తీసుకుంటారని.. తప్పనిసరిగా భేటీకి నేతలు రావాలని కేటీఆర్ కోరారు.