అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఎప్పటికప్పుడు ముదురుతూనే ఉంది. హస్తం గ్యారెంటీలు, రైతుల హామీలనే టార్గెట్ చేస్తున్నారు గులాబీ నేతలు. సాగు నీరు, కరెంట్, కరువు ఇలా అన్నదాతల అంశాలే ప్రధాన ఎంజెడాగా రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతోంది. తాజాగా ఇరు పార్టీల మధ్య బోనస్ వార్తో మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో పొలిటికల్ కిక్కు మరింత పెరిగింది.
కాంగ్రెస్ అధికార చేజిక్కించుకున్న నాటి నుంచి హస్తం నేతలు ఎక్కడ చిక్కుతారా అని కాకుకుని కూర్చుకుంది గులాబీ దండు. రేవంత్ సర్కార్ ఏర్పాటు సమయంలోనే చెప్పినట్టు 100 రోజుల సమయం వరకూ సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ గ్యారెంటీలు, ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల అంశాలే ప్రధాన అజెండా పొలిటికల్ ఫైట్కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకూ సాగు నీరు, కరెంట్పై పోరు బాట పట్టిన బీఆర్ఎస్ నేతలు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్పై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం… అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న హస్తం నేతలు తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి 500ల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్టుగానే రేవంత్ సర్కార్ ఏర్పాటుకావడంతో ఇన్నాళ్లూ రైతులు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కోసం ఎదురు చూశారు. అయితే,.. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి మాట మార్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కువగా దొడ్డు రకం వడ్లే పండిస్తామని.. సన్న రకం చాలా తక్కువ పండిస్తామని.. ఈ బోనస్ వల్ల ఉపయోగం లేదని వాపోతున్నారు. సన్నరకం వరికి రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ కాబట్టి.. తాము దొడ్డు వడ్లనే పండిస్తామని చెబుతున్నారు అన్నదాతలు.
ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు గులాబీ శ్రేణులు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులను బోనస్ పేరుతో నమ్మించి వారి ఓట్లు పొందాక.. ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని ధ్వజమెత్తారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ? ఇది ప్రజా పాలన కాదు. రైతు వ్యతిరేక పాలన అని రాసుకొచ్చారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు… కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి అన్నదాతలను ఆగం చేశారు.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15 వేలు రైతు భరోసా అని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు. వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఇంకా వేయలేదన్నారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని.. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని ఫైర్ అయ్యారు.
ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తుండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరమన్నారు. ఇదే ప్రకటన ఓట్లకు ముందు ఎందుకు ప్రకటించ లేదని నిలదీశారు. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని.. పదిశాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని.. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుందని తెలిపారు, దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామని.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు క్షేత్రస్థాయి గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరికి ధీటుగా హస్తం నాయకులు కౌంటర్ ఎటాక్ ఇస్తుండటంతో ఇరు పార్టీల మధ్య బోనస్ వార్ ముదురుతోంది. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా బోనస్ ప్రకటనతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో బోనస్ వార్ రచ్చ మరింత హీట్ పుట్టిస్తోంది.