ఏపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది ఆ పార్టీ. ఇప్పటికే పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా వెలువడగా.. త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా విడుదల కాబోతోంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రాష్ట్ర నాయకత్వం.. పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది.
ఇందుకోసం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కార్యాచరణ సిద్ధం చేశారు. ఇవాళ విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జాతీయ నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు 150 మంది నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్గా సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీమ్లను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో ఉన్న సీని యర్లకు, నియోజకవర్గంలో పట్టున్న కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. పురంధేశ్వరి బరిలో దిగనున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ప్రచారం లో పాల్గొ నేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన ఎక్కడెక్కడ ఉమ్మడి సభలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు.