లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఓవైపు.. ప్రధాన పార్టీలన్ని గెలుపుగుర్రాలకు ప్రకటించే పనిలో నిమగ్నవుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్కి శ్రీకారం చుట్టింది బీజేపీ. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతున్నారు. అందులో.. కొందరు హస్తంతో దోస్తీ కడుతుంటే.. మరికొందరు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది అధికార కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటుంటే.. కొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకుంటున్నారు.
తాజాగా నలుగురు బీఆర్ఎస్ నేతలు.. బీజేపీలో చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలైన సీతారాం నాయక్, గోడం నగేశ్తో పాటు హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షం లో.. కాషాయ కండువా కప్పుకున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కేటీఆర్కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు… బీజేపీలో చేరారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తుందన్నారు తరుణ్ చుగ్.బీఆర్ఎస్ గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోలేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. గులాబీ పార్టీ ఎస్టీలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. దేశమంతా బీజేపీ వైపు చూస్తోందని… అందుకే కాషాయ పార్టీలో చేరానని తెలిపారు.
ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాషాయ తీర్థం పుచ్చుకోగా.. నాగర్ కర్నూల్ ఎంపీపీ రాములు కూడా బీజేపీలో చేరిపోయారు. కాగా.. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలిజాబితాలో.. నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పీ రాములు కుమారుడు భరత్ కు బీజేపీ అధిష్ఠానం టికెట్ కూడా ప్రకటించింది. మరి ఆపరేషన్ ఆకర్ష్ కాషాయ పార్టీకి ఎంత మేరకు కలిసివస్తుందో చూడాలి.


