హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరువలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జులానా నియోజకవర్గంలో రెజ్లర్ వినేశ్ పోగట్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగు రౌండ్లు ముగిసేవరకు యోగేశ్ ప్రస్తుతం మూడు వేల ఓట్ల లీడింగ్లో ఉన్నారు. లడ్వాలో సీఎం నయాబ్సింగ్ సైనీ ఆధిక్యంలో మూదుసుకెళ్తున్నారు. హర్యానాలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ విశ్వాసం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఏర్పాటు చేసిన వ్యవస్థ హర్యానాకు చాలా కాలం పాటు ప్రయోజనాలను తెస్తుందని చెప్పారు. హర్యానాలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అన్నారు. కాంగ్రెస్కు సొంతంగా మెజారిటీ వస్తుందని హుడా ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బీజేపీ 49, కాంగ్రెస్ 35 స్థానాల్లో ముందంజలో ఉండగా.. అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఎవరికి వారే హర్యానాలో విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య తీవ్రపోటీ నెలకొనడంతో.. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే.. కొత్త ఆశలు చిగురిస్తాయి.
జమ్ము కశ్మీర్ లో బీజేపీకి షాక్ తప్పేలా లేదు. ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. ఆర్టికల్ 370 రద్దుతో తమకే ఓట్లు ఎక్కువగా పడతాయని భావించగా.. ఊహించని ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. ట్రెండ్స్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 49 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ, జమ్ములో కాంగ్రెస్ కూటమి లీడింగ్ లో ఉండగా.. రెండు చోట్లా తమదే గెలుపు అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 90 స్థానాలున్న జమ్ముకాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 48 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీచేసిన రెండు చోట్ల లీడ్లో ఉండగా, మెహబూబా ముఫ్తీ కూడా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్లే కనిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జమ్ము కశ్మీర్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొన్ని సంస్థలు.. మరికొన్ని సంస్థలు బీజేపీ హవానే ఉంటుందని భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఈరోజు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపించడం లేదు.