స్వతంత్ర వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను అతితీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. ఇది గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కచ్, ద్వారక ప్రాంతాల్లో దాదాపు 12వేల మందిని మరో చోటుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే జూన్ 15 వరకు గుజరాత్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తూఫాను ఎఫెక్ట్తో పశ్చిమ రైల్వే పరిధిలో వందకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటివరకు 67 రైళ్లను అధికారులు రద్దు చేయగా.. మరో 56 రైళ్ల ప్రయాణాన్ని కుదించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.