మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ ని శనివారం కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇవాళ ఉదయం కడప జిల్లాలోని పులివెందులలో ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో కాసేపు విచారించిన అధికారులు హైదరాబాద్ తరలించారు. తాజాగా సీబీఐ కోర్టులో ఉదయ్ ని హాజరుపర్చడంతో న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. కాగా వివేకా హత్య జరిగిన రోజు ఎంపీ అవినాశ్ తో పాటు ఘటన స్థలంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా అధికారులు గుర్తించారు.