మాజీ మంత్రి, సీనియర్ వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన వేళ ఆయనకు ఘోర అవమానం జరిగింది. పోలీసుల ఓవర్ యాక్షన్ తో హర్ట్ అయిన బాలినేని సభకు హాజరవనంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే…
సీఎం జగన్ ఈరోజు రెండవ విడత వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను మార్కాపురం వేదికగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హెలికాఫ్టర్ ద్వారా మార్కాపురం చేరుకున్నారు. అయితే అంతకంటే ముందే జగన్ ని రిసీవ్ చేసుకోవడానికి మార్కాపురం హెలిప్యాడ్ వద్దకు మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని బయలుదేరారు.
ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ లేదని ఆపేశారు. వాహనం పక్కన పెట్టి నడిచి వెళ్లాలని సూచించారు. పోలీసుల తీరుతో హర్ట్ అయిన బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండానే వెనుతిరిగారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కి తగ్గలేదు. సీఎం సభకు రానంటూ తిరిగి ఒంగోలు వెళ్లిపోయారు. పార్టీకి ఎంతో సేవ చేసిన తమ నాయకుడిని సొంత జిల్లాలో ఘోరంగా అవమానిస్తారా అంటూ ఆయన అభిమానులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సీఎం జగన్ గుడ్ న్యూస్… నేడు అకౌంట్ లో డబ్బు జమ