ఏపీలో ఎన్నికల వేళ ఈసీ చర్యలతో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులపై వేటు, నియామకాలు పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఎన్నికల వేళ ఏపీలో ఏం జరుగుతోంది..? అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఎందుకు వేటు వేసింది..? బదిలీ చేయడానికి కారణాలేంటి..?
ఏపీలో ఎలక్షన్ హీట్ సమ్మర్ను మించి కాకరేపుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ, విపక్ష కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నాయి. జగన్ గద్దె దించడమే టార్గెట్గా వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. అయితే,.. కొందరు ఉన్నతాధికారులు అధికార వైసీపీకి కొమ్ము కాస్తున్నారంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు. ఈ క్రమంలో చర్యలకు పూనుకున్న ఈసీ.. పలువురు అధికారులపై వేటు వేస్తూ.. మరికొందరిని నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల వేటుకు గురైన రాజేంధ్రనాథ్ రెడ్డి స్థానంలో.. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాను తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది.
ఏపీ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై గత కొంతకాలంగా విపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్పై బదిలీ వేటు వేసింది. తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఆ పోస్టుకు తగ్గ ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సీనియర్ అధికారులు ద్వారకా తిరుమలరావు, హరీష్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ల పేర్లను ప్రభుత్వం పంపగా.. ఇందులో ఏపీ నూతన డీజీపీగా ఈసీ హరీష్ రావు గుప్తాను ఎంపిక చేసింది. ఎన్నికల నేపథ్యంలో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది.
ఇక అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశిస్తూ.. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఇదే క్రమంలో అనంతపురం డిఎస్పి వీర రాఘవరెడ్డి, రాయచోటి డిఎస్పి మహబూబ్ బాషాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం.. అనంతపురం అర్బన్ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్కుమార్, రాయచోటి డీఎస్పీగా రామ చంద్రరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు బదిలీ చర్యలు తీసుకుంది ఈసీ. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా అనంత పురం టౌన్ లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలు పాలు చేశారని.. ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారని మండిపడింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ.. డీఎస్పీ వీరరాఘవ రెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్ మహ బూబ్ బాషా పైనా వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులు వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమో రాండం రిలీజ్ చేశారు.ఇలా ఎన్నికల వేళ ఏపీలో అధికారులపై బదిలీ వేట్లు, నూతన నియామకాలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలోనే మే 13న జరిగే పోలింగ్ సమయానికి ఇంకా ఎందరిని మార్చనుంది..? ఎవరిపై చర్యలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


