స్వతంత్ర వెబ్ డెస్క్: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తర ప్రదేశ్ లో నిర్మితమవుతుంది అయోధ్య రామ మందిరం. వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న ఈ ఆలయానికి అదనపు హంగులును జోడిస్తున్నారు. గర్భగుడిలోని రాముని విగ్రహంపై శాస్త్రీయంగా సూర్యకిరణాలూ పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం రామాలయ భవనం పైభాగంలో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్మాణాలు చేయనున్నారు. ఓ పైప్ను అమర్చి.. ఆధునిక లెన్సుల ద్వారా సూర్య కిరణాలను ప్రసరింపజేయనున్నారు. ఇది పూర్తైతే ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు.. రాముడి విగ్రహం నుదిటిపై పడతాయి.
ఇక మరోవైపు రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గర్భగుడి కోసం రాతి స్తంభాలను చెక్కుతున్నారు. ఈ మేరకు.. రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర.. పనులను పరిశీలించారు. అనంతరం, ఎల్ అండ్ టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన నవంబర్ నాటికి ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీరామ మందిరం ప్రాంగణంలో.. ప్యాసెంజర్ ఫెసిలిటేషన్ సెంటర్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి.
ఆలయ నిర్మాణం జూన్ నెలలో మరింత వేగంగా జరిగేలా చర్యలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో పనులు 80 శాతానికి పైగా పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలో మార్బుళ్లు పరుస్తారని సమాచారం. పైకప్పు పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో 44 తలుపులను అమర్చనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి భారీగా టేకు కలపను తీసుకొచ్చారు. తలుపులను తయారు చేసేందుకు హైదరాబాద్ నుంచి పది మంది కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోనే తలుపులు సిద్ధం కానున్నాయి. పైకప్పు పనులు పూర్తి కాగానే.. తలుపులు అమర్చడం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తైతే.. తొలి దశ నిర్మాణం అయిపోయినట్లే.