వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో తెలిపారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. అలాగే మత్స్యకార భరోసా అమలుకు రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు.
నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్లో చర్చ జరిగింది. ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ధాన్యం కొనుగోలు కోసం రూ.700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లజేషన్ ప్రతిపాదనపై చర్చించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. అలాగే ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై చర్చ జరిగింది.
నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్పై కుడి, ఎడమ వైపు మిని హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదన పైనా మంత్రి వర్గంలో చర్చ జరిగింది.