మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ క్రికెటర్ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూ లంగా జరిగాయని, అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని కమలం వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్లోని బసిర్ హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోం ది. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం బసిర్హత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే.
ఇటీవలే షమి తన కుడికాలి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్ మీడియాలో వెల్లడించగా.. మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చారు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.