ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి శుభం పలికారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అధికారంలో ఉన్నామా..? అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామం అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రెండు రోజుల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని చంద్రబాబు కామెంట్ చేశారని.. ఆ వ్యాఖ్యలను సజ్జల ఎండార్స్ చేశారని అన్నారు. ఈ రాష్ట్రంలో అరాచకమే ఉందని ప్రజలెప్పుడో గుర్తించారరని.. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయి. ప్రజలు.. ప్రజాస్వామ్యం అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవని వైసీపీ డిక్షనరీలో లేని పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క షాకుతోనే ప్రజలు సజ్జలకు గతాన్ని గుర్తు చేశారని అన్నారు.
‘బుల్డొజ్ అనేది వైసీపీ ఇంటి పేరు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం బుల్డొజ్ చేయడం కాదా..? ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని మేం నమ్ముతున్నాం.. మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. మీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదు.. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారు..? ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి.. మా సంఖ్యా బలం 23. మా దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు..? పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా..? మీ ఓటర్లు వేరా..? ముఖం మీద ఎవరూ మేం ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా..? పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారు.. త్వరలో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి గెలవబోతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను పెంచాయి.’- పయ్యావుల కేశవ్