అధికారం కోసం జరిగే యుద్దంలో ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమే. ఎన్నికలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు,ఎత్తుగడలు, వ్యూహాలు. ఎన్నిక లంటే ఓ చదరంగం. ఏ పావును ఎక్కడ కదపాలన్న దానిపై అవగాహన అవసరం. ప్రచారంలో ఏ అంశాన్ని ఊదరగొట్టాలో, ఏ ఇష్యూను తొక్కిపట్టేయాలో క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. జనం నాడిని పసిగట్ట గలిగిఉండాలి. అవసరమైతే గాలిని తమకు అనుకూలంగా మార్చుకో గలిగి ఉండాలి. ఈ విద్యలో ఆరి తేరిన వారే ఎన్నికల్లో గెలుస్తారు. అధికారంలో లోకి వస్తారు.
ఇప్పుడు సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. ముప్ఫయి రోజుల్లో ఇతర భాషలు నేర్పే పుస్తకంలాగా ఎన్నికల్లో పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. భారత రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్. బిహారీ బాబు ప్రశాంత్ కిశోర్ ఈ కొత్త కల్చర్ కు ఆద్యుడు. దశాబ్దం పైగా రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే కార్పొరేట్ ప్రొఫెషన్ ను ఆయన ఇప్పటికీ విజయవంతంగా నడుపుతున్నారు రెండేళ్ల కిందట రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ ప్రశాంత్ కిషోర్ హడావిడి చేశారు. ఆ తరువాత ఏం ఆలోచించాడో తెలియదు కానీ అబ్బే పార్టీ పెట్టడం లేదు అంటూ వెనక్కి తగ్గారు. మనదేశంలో రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే నయా కార్పొరేట్ ప్రొఫెషన్ లో ప్రశాంత్ కిశోర్ ఓ బ్రాండ్ . అంతే. మరో ముచ్చటే లేదు. బీజేపీ సహా ప్రాంతీయ పార్టీ ల అధినేతలైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీశ్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంకే స్టాలిన్ వీరందరికీ ప్రశాంత్ కిశోర్ గతంలో సేవలందించారు.ఆయా పార్టీలను గెలుపు తీరాలకు చేర్చిన చరిత్ర స్వంతం చేసుకున్నారు.
ప్రశాంత్ కిశోర్ నూటికి నూరు శాతం ప్రొఫెషనల్. ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నా అది ఎన్నికల వరకే పరిమితం. అటు బీజేపీకి, ఇటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి వాటికి గతంలో ఒక ప్రొఫెషనల్ గా ఆయన సేవలందించారు. ప్రశాంత్ కిశోర్కు రాజకీయ పార్టీల ఐడియాలజీ పట్టింపులేదు. బీజేపీ అయినా, డీఎంకే అయినా ఆయనకు ఒకటే. సిద్ధాంతాల రాద్ధాంతాల పట్టింపు ఆయనకు అసలేమాత్రం ఉండదు. ప్రశాంత్ కిశోర్ కు తెలిసిందల్లా ఒకటే. జనం నాడిని పసిగట్టడం. గాలిని ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయపార్టీకి అనుకూలంగా మరల్చడం. అందుకు అనుగుణంగా ఎత్తుగడలు వేయడం వ్యూహాలు పన్నడం. తనపై భరోసాతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీని గెలిపిం చడం.అంతకుమించి మరే ఇతర విషయాన్ని ఆయన పట్టించుకోడు.
ప్రశాంత్ కిశోర్ అంటే ఒన్ మ్యాన్ షో కాదు. ప్రశాంత్ కిశోర్ ఓ వ్యవస్థ. ఆయనకు ఐ ప్యాక్ పేరుతో ఓ సొంత రీసెర్చ్ టీమ్ ఉంది. ఇందులో మెరికల్లాంటి వందలాదిమంది యువతీ యువకులు పనిచే స్తుంటారు. వీళ్లందరూ పక్కా ప్రొఫెషనల్స్. ఎన్నికల్లో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే అంశాలేమిటి? ఎన్నికల ప్రచారం తీరు ఎలా ఉండాలి? ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేయాలి? అది కూడా ఎంతవరకు? ఏఏ అంశాలను హైలెట్ చేయాలి? ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి గుడ్ విల్ ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? టికెట్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? ఇలా ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధిం చిన సమస్త వివరాలను ఐ ప్యాక్ సంస్థ సేకరిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి ఐ ప్యాక్ సంస్థ నివేదిక అంద చేస్తుంది.
ప్రశాంత్ కిశోర్ వద్దన్నవారికి ఆయా రాజకీయ పార్టీలు సహజంగా టికెట్లు ఇవ్వవు. ప్రశాంత్ కిశోర్ వడపోత కార్యక్రమం మీద ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలకు అంత నమ్మకమన్న మాట. తన సిఫార్సులను, సలహాలను పక్కన పెట్టి టికెట్లు ఇస్తే పని మధ్యలోనే వదిలివేసి వెళతాడట ఈ బిహారీ బాబు. ప్రశాంత్ కిశోర్ ఎవరితో డీల్ కుదుర్చుకున్నా అంత నిక్కచ్చిగా ఉంటాడంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు.ప్రశాంత్ కిశోర్ కు సక్సెస్ గ్రాఫ్ ఎక్కువ. ఆయన కెరీర్ లో ఒకే ఒక్కసారి లెక్కలు తప్పాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పనిచేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఓటమికి కాంగ్రెస్ హై కమాండే కారణమంటారు ప్రశాంత్ కిశోర్. తన సూచనలను పక్కన పెట్టి కాలం చెల్లిన ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని ఓటమి దిశగా అధిష్టానం నడిపించిందన్నది ఆయన వాదన. ఇదొక్కటీ మినహాయిస్తే ఆయన ఏ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని పని చేస్తే ఆ పార్టీయే పవర్ లోకి వచ్చింది. అయితే ప్రశాంత్ కిశోర్ అంటే గిట్టనివాళ్లు అది యాధృచ్చికం అంటారు. అంతేకాదు, గెలిచే పార్టీ తోనే ప్రశాంత్ కిశోర్ ఒప్పందం కుదుర్చు కుంటారని కూడా అంటుంటారు. ఇందులో నిజానిజాలు ఎలాగున్నా…2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, సూచనలే కారణమంటారు రాజకీయ పండితులు.
సునీల్ కనుగోలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెరమీదకు వచ్చిన పేరు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తొలిసారిగా సునీల్ కనుగోలు పేరు రాజకీయవర్గాల్లో మార్మోగింది. కాగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మరోసారి సత్తా చాటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కొనుగోలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతో సునీల్కు కొంతకాలంగా అనుబంధం ఉంది. సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐ ప్యాక్ రీసెర్చ్ టీమ్కు చాలా కాలం పాటు సునీల్ కనుగోలు సేవలం దించారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సునీల్దే మేజర్ రోల్ అంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. కిందటేడాది మేనెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుం దుభి వెనుక సునీల్ కనగోలుదే కీలకపాత్ర అంటారు రాజకీయ విశ్లేషకులు. బస్వరాజ్ బొమ్మైది 40 శాతం కమిషన్ సర్కార్ అనడం, పే సీఎం నినాదం. ఈ అంశాలతో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వినూత్న ప్రచారం నిర్వహించారు. బీజేపీని టార్గెట్గా చేసుకుని సునీల్ కనుగోలు డిజైన్ చేసిన క్యాంపెయిన్ కర్ణాటకలో సూపర్ డూపర్గా సక్సెస్ అయింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి సునీల్ కనుగోలు ఆయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలను పట్టించు కోడు.నేరుగా ఏఐసీసీకే ఆయన బాధ్యుడు. జనం అభిప్రాయాలను గాంధీ కుటుంబానికే ఉన్నది ఉన్నట్లు గా చేరవేస్తాడు.
కర్ణాటకలో విజయం సాధించడంతో వ్యూహకర్త సునీల్పై కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్కు భరోసా పెరిగింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించే వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలుకు ఏఐసీసీ అప్పగించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ కనుగోలు తీవ్రంగా శ్రమించారంటారు రాజకీయ విశ్లేషకులు. తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి సునీల్ మన తెలుగోడే అంటారు. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం నుంచి ఎదిగొచ్చిన వ్యూహకర్తగా చెబుతారు. ఇక్కడో విశేషం ఉంది. సునీల్ సహజంగా హడావిడి చేసే మనిషి కాదు. సహజంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అందువల్లే ఆయన వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు.ఎన్నికల వ్యూహకర్తల జాబితాలో వినిపిస్తున్న మరో పేరు రాబిన్ శర్మ. ఈయన కూడా చిన్నోడు కాదు. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో ఘటికుడే. చాలా కాలం పాటు ప్రశాంత్ కిశోర్ టీమ్ లో పనిచేశాడు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ నుంచి విడిపోయి ఎత్తుగడలు, వ్యూహాలు అందచేసే సొంత దుకాణం పెట్టుకున్నాడు.
ప్రశాంత్ కిశోర్ కానివ్వండి, సునీల్ కనుగోలు కానివ్వండి. ఆయా రాజకీయ పార్టీల నుంచి వీళ్లు వసూలు చేసే ఫీజు చాలా హై రేంజ్ లో ఉంటుంది. అలా ఇలా కాదు. కొన్ని వందల కోట్లలో ఉంటుందంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. వాస్తవానికి పాత రోజుల్లో ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ పార్టీ అనునిత్యం జనంతో మమేకం అయి ఉండేది. సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది. ఆయా పార్టీలకు సలహాలు ఇచ్చే పెద్దలు అందులోనే వివిధ కీలక పదవుల్లో ఉండే వారు. వారి ఆలోచనల మేరకు , ఎత్తుగడల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రం లోకి దిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజలతో రాజకీయ పార్టీలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేంతటి ఓపిక, తీరికా రాజకీయ పార్టీలకు లేకుండా పోయాయి. అందుకే ఆ పని చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి రాజకీయపార్టీలు.


