హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీదర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యంత గోప్యంగా పోలీసుల ముందు కొచ్చిన ఆయన్ను కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24వ తేదీ రాత్రి డ్రగ్ పార్టీ జరిగిన విషయం మీడియా లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై క్రిష్ స్పందించి.. తాను ముంబయిలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు రావాలని పోలీసులు కోరగా.. వచ్చే సోమవారం వస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నిన్ననే హాజర య్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ నమూనాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తుండటం కేసులో కీలక పరిణామంగా మారింది.
హోటల్పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషి యల్ రిమాండు కు అనుమతి లభించలేదు. కానీ హోటల్లో లభించిన మూడు ఖాళీ ప్లాస్టిక్ పేపర్లతో పాటు ఒక వైట్ పేపర్ రోల్లోని తెల్లటి పొడి ఆనవాళ్లను డ్రగ్ కిట్లో విశ్లేషించి కొకైన్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్టు చేసిన డ్రగ్ పెడ్లర్ అబ్బాస్తోపాటు మరో నిందితుడి జ్యుడిషియల్ రిమాండు కు న్యాయస్థానం అంగీకరించింది.
ఈ కేసులో 14 మందికి ప్రమేయముందని ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. వీరిలో లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు తెలియ డంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. లిషి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. వీరు డ్రగ్స్ వినియోగించకుంటే పోలీసుల ఎదుటకు రావడానికి ఎందుకు వెనకాడుతున్నా రనేది చర్చనీ యాంశంగా మారింది. ఆలస్యం చేసే కొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా వారందరినీ గుర్తించి వైద్యపరీక్షలకు పంపాలనే యోచనతో పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. మరోవైపు ఇప్పటికే నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డ్రగ్స్ పార్టీకి కొకైన్ సరఫరా చేసింది మీర్జావహీద్ బేగ్ అని ఇదివరకే గుర్తించిన పోలీసులు.. అతడిని విచారించడం తో మరో ఇద్దరు పెడ్లర్ల ఆచూకీ లభ్యమైంది. యాకుత్పురాకు చెందిన బేగ్కు స్థానికులైన ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్ అనే పెడ్లర్ల ద్వారా కొకైన్ సరఫరా అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వారిద్దరి కోసం సైబరాబాద్ పోలీసులు గాలిస్తు న్నారు.


