వైసీపీలో ఏం జరుగుతుందో అధినేత జగన్కు కూడా అర్థం కావడం లేదా? ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న నాయకులు అసమ్మతి రాగం వినిపించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అందరూ జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ కోటరీ బాధ పడలేక కొందరు పార్టీని వదిలేసి టీడీపీలోకి వెళ్లిపోయారు. కానీ వైసీపీలోనే ఉన్న నాయకులు మాత్రం తమ బాధను తమలోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒకరి తర్వాత మరొకరు పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
వైసీపీలో అత్యంత విధేయుడిగా ఉన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు మాట్లాడిన మాటల కారణంగానే పార్టీకి డ్యామేజ్ ఏర్పడిందని అన్నారు. ఆయన నేరుగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నాయకులను టార్గెట్ చేశారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన కామెంట్లను టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకొని సక్సెస్ అయ్యిందని కేతిరెడ్డి చెప్పారు. ఇదంతా వైసీపీ నాయకులు స్వయంగా చేసిన తప్పులే అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎదరు వారిపై ఇష్టానుసారంగా మాట్లాడి.. పార్టీని డ్యామేజ్ చేయడమే కాకుండా.. ఇప్పుడు జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందనే రీతిలో కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కేవలం కేతిరెడ్డి మాత్రమే కాకుండా విశాఖపట్నానికి చెందిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కూడా తన అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ఎదుటి పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి లాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వదిలి వెళ్లిపోతే బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వాసుపల్లి గణష్ కోపమంతా సాయిరెడ్డి మీదే అని తెలిసింది. గతంలో సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు గణేష్ ఇబ్బంది పడ్డారని.. అందుకే ఇప్పుడు గళం విప్పుతున్నారనే చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన సాయిరెడ్డే.. తమకు సమస్యగా మారాడని వాసుపల్లి అన్నారు. వైఎస్ జగన్ను సాయిరెడ్డి పూర్తిగా మిస్ గైడ్ చేశారని చెప్పారు. అసలు సాయిరెడ్డి సలహా ఇవ్వకపోతే జగన్ రుషికొండ మీద ప్యాలెస్ కట్టేవారే కాదని వాసుపల్లి గణేష్ ఆరోపించారు. ఇప్పుడు సాయిరెడ్డి పార్టీని వీడటం చాలా మంచిది అయ్యిందని.. ఇక వెళ్లాల్సిన వాళ్లు కూడా ఉన్నారని గణేష్ చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పార్టీకి చాలా ప్రమాదకరంగా తయారయ్యారని.. వారిని వెనకేసుకొని రావడం కూడా పార్టీకి నష్టమేనని అన్నారు.
పనిలో పనిగా మాజీ మంత్రి రోజాను కూడా వాసుపల్లి టార్గెట్ చేశారు. రోజా.. ఎంత తక్కువ మాట్లాడితే పార్టీకి అంత మంచిదని అన్నారు. సాధారణంగా సైలెంట్గా ఉండే వాసుపల్లి గణేష్ ఒక్కసారిగా పార్టీ నేతలపై మండిపడటం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసిందట. సొంత పార్టీ నేతల కారణంగానే ఓడిపోయామనే బాధలోనే కేతిరెడ్డి, వాసుపల్లి వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నరనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో జగన్ కూడా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి కూడా ఉన్నట్లు తెలిసింది. పార్టీని ఇప్పటికైనా గాడిన పెట్టకుంటే మరింత డ్యామేజ్ తప్పదని వాసుపల్లి భావిస్తున్నారట.
అయితే వాసుపల్లి వైసీపీని వీడాలని భావిస్తున్నారని.. అందుకే ఇలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులతో టచ్లోకి వెళ్లారని.. ఎంపీ సీఎం రమేశ్తో ద్వారా మంతనాలు జరుపుతున్నారనే చర్చ జరుగుతుంది. అందుకే అవకాశం కోసం వేచి చూస్తున్న వాసుపల్లి.. వల్లభనేని వంశీ అరెస్టును అడ్డం పెట్టుకొని పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.
ఏదేమైనా సీనియర్ నాయులు ఇలా పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తే.. అది పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ ఇలాంటి వారిని కంట్రోల్లో పెట్టాలని కోరుతున్నారు.