మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి.. నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఒక్కరే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎఫ్ఈవోకు నిధుల బదిలీ, ఫెమా ఉల్లంఘనలు, దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. బ్యాంకు అధికారులతో పాటు పలువురు హెచ్ఎండీఏ అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనలపై ఈడీ ఆరా తీయనుంది.
కేటీఆర్ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు.
మరోవైపు ఈడీ కార్యాలయం వద్దకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.